సందడిగా మొదలైన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు

  • గుజరాత్‌లో శుక్రవారం జరిగిన ‘లగన్ లఖ్వాను’ వేడుక
  • తొలి వివాహ ఆహ్వాన పత్రిక తయారీ
  • ప్రత్యేకంగా రూపొందించిన లెహంగాలో మెరిసిపోయిన కాబోయే వధువు రాధిక మర్చంట్

సంపన్న భారతీయుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. దిగ్గజ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ‘లగన్ లఖ్వాను’గా పిలిచే తొలి వేడుక గుజరాత్‌లోని జామ్ నగర్‌లో శుక్రవారం జరిగింది. ముకేశ్ అంబానీ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఈ వేడుకను నిర్వహించారు. కంకోత్రిగా పిలిచే వివాహ తొలి ఆహ్వాన పత్రాన్ని ఈ వేడుకలో రూపొందించారు. ఇక కాబోయే జంట అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. కాగా వీరిద్దరి వివాహం ఈ ఏడాది చివరిలో నిర్వహించనున్నారు.

లగన్ లఖ్వాను వేడుకలో కాబోయే వధువు రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయక లెహంగాను ధరించింది. లెహంగాపై పూల డిజైన్‌లు ఆకట్టుకున్నాయి. ఇక ఆమె ధరించిన మూడు వరుసల డైమండ్ నెక్లెస్ సెట్ హైలైట్‌గా నిలిచింది. పాపిడి బిళ్లతో పాటు ఒక చేతికి కంకణం కనిపించింది. రాధిక మర్చంట్ ఫొటోలను మేకప్, హెయిర్‌స్టైల్ ఆర్టిస్ట్ లవ్లీన్ రామ్‌చందానీ  ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. కాగా అనంత్ అంబానీ ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక రాధిక మర్చంట్ 1994లో పుట్టింది. ఆమె తండ్రి విరేన్ మర్చంట్ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్ సంస్థ ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌కి సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.