Take a fresh look at your lifestyle.

వల్లభనేని వంశీకి తప్పని కష్టాలు.. మరోసారి రిమాండ్ పొడిగింపు

0 96

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ జ్యుడీషియల్ రిమాండ్‌ను విజయవాడ కోర్టు మరోసారి పొడిగించింది. వంశీతో పాటు కేసులో అరెస్టయిన మిగిలిన నిందితుల రిమాండ్‌ను కూడా ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ కిడ్నాప్ కేసులో వంశీని ప్రధాన నిందితుడిగా (ఏ1)గా పేర్కొంటూ పోలీసులు ఫిబ్రవరి 13, 2025న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బాధితుడు ఎం. సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల ఆరోపణలపై వంశీపై కేసు నమోదైంది. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన దళిత యువకుడు సత్యవర్ధన్‌ను వంశీ, ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని ఆరోపణలున్నాయి. కిడ్నాప్ సమయంలో సత్యవర్థన్‌ను హైదరాబాద్, విశాఖపట్నం మధ్య తిప్పినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

 

ఇటీవల మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీతో ఈ కేసు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిబ్రవరి 13న వంశీ అనుచరులు సత్యవర్ధన్‌ను కారులో కోర్టుకు తీసుకెళ్తున్న దృశ్యాలు కేసు నమోదుకు కీలకంగా మారాయి. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో వెంకట శివరామకృష్ణ (ఏ7), నిమ్మ లక్ష్మీపతి (ఏ8) కూడా ఉన్నారు. కాగా, వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.